[యునైటెడ్ స్టేట్స్, కెనడాల బహాయిల నుద్దేశించి 1916 సం. ఏప్రిల్ 19 న బహజీ సౌధంలోని అబ్దుల్-బహా గదిలోనూ; ఏప్రిల్ 20 న బహజీ సౌధంలోని పుణ్యయాత్రీకుల నివాసాల్లోనూ; ఏప్రిల్ 22 న బహాఉల్లా దివ్యసమాధికి చేరువగా ఉన్న ఉద్యానవనంలోనూ దీనిని వెలువరించడం జరిగింది.]
వీరు భగవంతుని సేనలు, ప్రాక్పశ్చిమముల విజేతలు. వీరిలోని ఏ ఒక్కరు తమ వదనమును ఏ దెసకు మరలించి, ప్రజలను భగవంతుని దివ్యసామ్రాజ్యమునకు ఆమంత్రించినా, ఆతడి సాహాయ్యమునకూ, సుదృఢీకరణకూ సర్వోత్కృష్ట సైనికబలగములూ, దైవాశీస్సులూ సత్వరమే తరలుతాయి. సర్వద్వారములూ తెరచుకొనుటనూ, సమస్త పటిష్ట రక్షణనిర్మాణములూ, దుర్భేద్యదుర్గములూ భూపతనము లగుటనూ ఆత డవలోకించును. ఒంటరిగా, ఏకాకిగా ప్రపంచసేనల నెదిరించి, సకల దేశముల సేనల వామదక్షిణ పార్శ్వముల నోడించి, యావద్దేశముల సైనిక శ్రేణులనూ ఛేదించుకుని, ప్రాపంచికశక్తుల మూలకేంద్రముపైననే తన ముట్టడిని కొనసాగించు నాతడు. భగవంతుని సేనలకు అర్థమిదే.
బహాఉల్లా మీ యెట్టయెదుట దెరచిన ద్వారములను పరికింపుడు, మీరు సాధించుటకు నిర్దేశితమైన స్థాయి ఎంతటి ఉదాత్తమో, మహోన్నతమో! పరికింపుడు, మీ కనుగ్రహీతములైన ఉపకృతు లెంతటి అపూర్వములో! ఈ పానపాత్రముతో మత్తిల్లితిమేని, మన దృష్టికి యీ భూగోళసార్వభౌమాధికారము బాల్యక్రీడకన్నను అత్యల్పమైనదే యగును. వారు యుద్ధాంగణమున యావత్ప్రపంచ ప్రభుత్వ మకుటమును నిలిపి దానిని స్వీకరింపుమని మనలోని ప్రతి ఒక్కరినీ ఆహ్వానించినచో, నిస్సందేహముగా మనము దానికి లొంగక, తత్స్వీకరణమునకు నిరాకరింపవలె.
అయితే, ఈ సర్వోన్నత స్థాయీసాధన, కొన్ని నిర్దిష్టనిబంధనల పరిపూర్తిపై ఆధారితమై ఉంటుంది: తొలి నిబంధన - భగవంతుని దివ్యఒడంబడికయెడ స్థైర్యము. ఎందులకనగా: ఒడంబడిక శక్తి – భ్రాంతి నొందిన వారి సంశయముల నుండి బహాఉల్లా దివ్యధర్మమును కాపాడుతుంది. భగవంతుని దివ్యధర్మపు టభేద్య దుర్గమిది, భగవన్మత సుస్థిర స్తంభమిది. భగవంతుని దివ్యఒడంబడిక తప్ప ఇక ఏ శక్తీ ఈనాడు బహాయి ప్రపంచపు టేకత్వమును సంరక్షింపజాలదు; లేని పక్షమున, విభేదములు పెనుతుఫానువలె బహాయి ప్రపంచము నావరిస్తాయి. మనుష్యప్రపంచపు టేకత్వమునకు ఇరుసు - ఒడంబడిక శక్తి తప్ప వేరొకటి కాదనునది ప్రస్ఫుటము. ఒడంబడిక సంభవించి ఉండకపోయినా, సర్వోతృష్ట లేఖినినుండి ఆవిష్కృతమై ఉండక పోయినా, సత్యసూర్యకిరణమువలె ప్రపంచమును తేజోభరితము గావించకపోయినా - భగవంతుని దివ్యధర్మసేనలు సంపూర్ణముగా చెదరిపోయి, స్వీయ వ్యామోహ, వాంఛా బంధితులు కొందరు పరశువును చేబూని, ధన్యవృక్షమును మొదలంటా తెగవైచి యుండెడి వారే. ప్రతి ఒక్కడూ తన స్వీయవాంఛను ప్రతిపాదించి యుండెడివాడు, ప్రతి వ్యక్తీ స్వీయాభిప్రాయ వ్యక్తీకరణము నొనరించి యుండెడివాడు. అజ్ఞానులు కొందరు ఈ మహత్తర ఒడంబడికను లక్ష్యము సేయక, భగవంతుని దివ్యధర్మ పునాదిని దుర్బల మొనరించగల మనుకొనుచు, తమ యుద్ధాశ్వముల నధిరోహించి రణభూమిలోనికి దూసుకు వచ్చినారు. కాని, భగవంతుడు ప్రకీర్తితుడు; వారెల్లరునూ పశ్చాత్తప్తులైనారు, పరాజితులైనారు; అచిరకాలమునకే వారు తీవ్రనిస్పృహకు లోనగుదురు. కనుక, విశ్వాసులు ఒడంబడికపట్ల స్థైర్యముతో ముందుగనే అడుగులను వేయవలె, తద్వారా, బహాఉల్లా ఆశీస్సు లన్నిదెసలనుండియూ వారల నావరింపవచ్చును, సర్వోన్నత దివ్యగణ సేనాదళములు వారి సమర్ధకులూ, సహాయకులూ కావచ్చును; అబ్దుల్-బహా ఉపదేశములూ, సూచనలూ సమస్తహృదయఫలకముల పైననూ చెరిగిపోవని తీరున, శిలాశిల్పిత చిత్రములవలె శాశ్వతములై నిలిచి పోవచ్చును.
ఓ మిత్రులారా! మైత్రి, మైత్రి! ప్రేమ, ప్రేమ! సమైక్యత, సమైక్యత! తద్వారా బహాయి దివ్యధర్మశక్తి దృగ్గోచరమై, అస్తిత్వప్రపంచమున వ్యక్తము కావచ్చును. నా యాలోచనలు మీ వైపుకు మరలినవి, నా మనస్సు మీ ప్రసక్తితో ఎగసిపడుతున్నది. మీ ప్రేమతో నా ఆత్మ యెట్లు ప్రజ్జ్వలిస్తున్నదో మీ రెఱిగినచో, మీ రొకరిపట్ల ఒకరు మరులు గొనునంతగా, మీ మనస్సుల యందున మహదానందపు వెల్లువ పొంగులు వారుతుంది.
మూడవ నిబంధన: బోధకులు నిరంతరమూ ఖండాంతర దేశము లన్నింటా, కాదుకాదు, ప్రపంచదేశము లన్నింటా పయనింపవలె, అయితే, అమెరికన్ నగరములలో పర్యటించిన అబ్దుల్-బహా వలె వారు పయనమును సాగింపవలె. ఆయన సమస్త అనుబంధ ప్రక్షాళితుడూ, విముక్తుడూ, పూర్ణవిరాగీ. పరమపూజ్యుడైన క్రీస్తు చెప్పినట్లు: మీ పాదధూళిని దులిపివేయుడి. 1
అమెరికాలో ఉన్నప్పుడు అనేకులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొన్ని బహుమతులను అర్పింప నెంచినారు, అయినను, కొన్ని సందర్భములలో—మే మత్యంత నిర్ధన పరిస్థితులయం దున్ననూ—శుభసంపూర్ణుని ప్రబోధములనూ, ఆదేశములనూ అనుసరించి యీ సేవకు డెన్నడూ, దేనినీ స్వీకరించకపోవుటను మీరు గమ నించినారు. అయిననూ, ఇంకొకవైపున, ఎవరైనా భగవంతుని నిమిత్తమై స్వచ్ఛందముగా, తమ ఇష్టపూర్తిగా, ఒక బోధకుని వ్యయములకై విరాళము నర్పించ నెంచినచో, ఆ విరాళదాతను సంతోషపెట్టుటకు, స్వల్పమొత్తమును బోధకు డంగీకరింప వచ్చును; అయినను, ఆతడు పూర్ణసంతృప్తితోనే జీవింపవలె.
ఆ విధముగనే, వీలైనప్పుడు, దివ్యఫలకముల అనువాదమున కొక సమితిని ఏర్పరుపవలె. ఫారసీ, అరబ్బీ, ఇంకా - అన్య విదేశీ భాషలపైనా సాధికారతను సాధించి, సమగ్రాధ్యయనము గావించిన, లేదా ఒక్క విదేశీ భాషనైనా ఎఱిగి ఉన్న విజ్ఞులు - దివ్యఫలకముల, ఈ దివ్యావిష్కరణ నిదర్శనాయుత గ్రంథముల - అనువాదమునూ, ఆ పుస్తకముల ప్రచురణనూ, ప్రపంచములోని ఐదు ఖండముల యందునా వితరణ మొనరించుటనూ మొదలిడవలె.
అలాగే, స్టార్ ఆఫ్ ది వెస్ట్ పత్రిక సంపాదకత్వ మత్యంత సక్రమముగ కొనసాగవలె; అయితే అందలి అంశములు - ప్రాక్పశ్చిమములకు అత్యంత ప్రధాన ఘట్టములు తెలియవచ్చేలా - భగవంతుని దివ్యధర్మవితరణకు సంబంధించినవై యుండవలె.
సూక్ష్మముగా చెప్పవలెనంటే, బహిరంగ సభలైనా, వైయక్తిక వేదికలైనా అన్ని సమావేశములలోనూ ఇప్పుడు ప్రస్తావితమౌతున్న దానిని గురించి దక్క యికదేనినీ చర్చించరాదు, సమస్త వ్యాసములూ భగవంతుని దివ్యధర్మమునే కేంద్రముగా గైకొని పరిభ్రమింపవలె. అందులోనికి అసంబద్ధ ప్రసంగములను లాగవలదు; వివాదము సంపూర్తిగా నిషేధమే.
వివిధ దిశలకూ పయనించు బోధకులు తాము వెళ్లుచున్న దేశీయభాషను నేర్చుకొనవలె. ఉదాహరణమునకు: జపనీసు భాషలో నిష్ణాతుడు జపానుకు వెళ్లుట, అటులే, చైనీసు భాష తెలిసిన వ్యక్తి సత్వరమే చైనాకు తరలుట వంటివి.
పర్యవసానముగా, పలువురు ఉద్యమించి, పై నిబంధనల కనుగుణముగా వ్యవహరించి ప్రపంచదేశము లన్నింటికీ – విశేషించి - అమెరికా నుండి ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియాలకు వెళ్లుట, జపాన్, చైనాల ద్వారా పయనములను సాగించుట సంభవించవచ్చును. ఆ విధముగనే బోధకులూ, విశ్వాసులూ జర్మనీ నుండి అమెరికా, ఆఫ్రికా, జపాన్, చైనాలకు పయనించవచ్చును; క్లుప్తముగా చెప్పవలెననిన, ప్రపంచమునందలి అన్ని ఖండములకూ, ద్వీపములకూ వారు పయనించవచ్చును. అలా అచిరకాలమునకే అత్యద్భుత ఫలితములు సాధించబడుతవి, ప్రపంచశిఖరాగ్రమున విశ్వశాంతి కేతనము రెపరెపలాడి, ప్రపంచమానవ యేకత్వజ్యోతులు విశ్వమును శోభాయమాన మొనరింపవచ్చును.
ఓ ప్రభూ! ప్రజలను విద్వేష, వైరముల అగాధము నుండి వెలికితీసి, ఈ అభేద్యాంధకారము నుండి వారికి విముక్తి నిమ్ము. వారి హృదయములను సమైక్యపరచు, శాంతి సఖ్యతల జ్యోతితో వారి నేత్రములను ప్రకాశింపజేయి. యుద్ధమునుండియు, రక్తపాతపు లోతులనుండియు వారిని విముక్తులను చేసి, దోషాంధకారమునుండి స్వేచ్ఛాజీవు లను గావించు. వారి కనులను గప్పిన తెరలను తొలగించి, మార్గదర్శక జ్యోతితో వారి హృదయములకు విజ్ఞతనిమ్ము. నీ మృదుకారుణ్యవాత్సల్యములతో వారిని దరి జేర్చుకో; శక్తివంతుల సర్వాంగములనూ ప్రకంపిత మొనరించు; వారి పట్ల నీ న్యాయవైఖరితో, క్రోథముతో వ్యవహరింప వలదు.
ఓ ప్రభూ! వినమ్రులను, విధేయులను నీ భూభాగములయం దావిర్భవిల్లజేసి, వారి వదనములను మార్గదర్శన కిరణములతో శోభిల్లజేసి, వారు ప్రపంచమునుండి బంధవిముక్తులై నీ దివ్యనామమును ప్రస్తుతి సేయుచూ, నీ ప్రశంసను సల్పుచూ, నీ పావనతా సౌరభములను మానవాళియందున పరివ్యాప్తము గావింపనిమ్ము.
ఓ ప్రభూ! ఈ అనైతిక వాంఛాతిమిరమును తొలగద్రోయుము, అనతికాలమునకే సమస్తదేశములూ శోభాయమానము గావింపబడు నీ అనురాగజ్యోతితో వారి హృదయములను జ్యోతిర్మయ మొనరింపుము. అంతియగాక, తమ దేశములను, తమ పరివారములను, తమ బిడ్డలను వీడి, నీ దివ్యసౌందర్యవాత్సల్యమునకై, నీ సౌరభపరివ్యాపనమునకై, నీ బోధనల ప్రచురతకై దూరభూములకు తరలిన నీ ప్రియతములను అనుగ్రహించు. వారి ఏకాంతమున వారి సహచరుడవు, పరదేశముల యందున వారి సహాయకుడవు, వారి విచారనివారకుడవు, విపత్తున వారి ఆశ్వాసకుడవు కమ్ము. వారి దాహార్తిని దీర్చు నీటి చుక్కవు, వారి రుగ్మతలకు నివారణౌషధానివి, వారి హృదయోద్విగ్నతకు లేపనానివి కమ్ము.
మీరు ఆ సువిశాల ఖండమున దివ్యబోధనల పరివ్యాపనమునకు బద్ధులై, భగవంతుని సామ్రాజ్యాహ్వానము నొసగి, దివ్యసేనాధీశుని, మహోన్నత వాగ్దత్తపురుషుని శుభవర్తమానమును ప్రకటించినందులకు మహోన్నత దివ్యాభీష్టమునకు ప్రస్తుతి. ఈ లక్ష్యమున మీరు సాహాయ్యమునొంది, అనుగ్రహీతు లైనందులకు దేవదేవునకు ధన్యవాదములు. ఇది సంపూర్ణముగా, దివ్యసేనాధీశుని అనుగ్రహముననే, పవిత్రాత్మ నిశ్వాసముల మూలముననే సంభవిల్లినది. మీ విజయపు సంపూర్ణ పరిమాణ మింకనూ అభివ్యక్తము కానందున, తత్ర్పాధాన్యమింకనూ గ్రహియింపబడలేదు. అనతికాలమునకే, మీలోని ప్రతి యొక్కరును తేజరిల్లు తారకవలె మీ దేశపు టాకసమున దివ్యమార్గదర్శకజ్యోతిని భాసిల్లజేసి, తత్ప్రజానీకమునకు అమరజీవన వైభవమును ప్రసాదించుటను మీ నేత్రములతోనే మీ రవలోకింతురు.
కాలినడకనైనా, కటికదారిద్ర్యములోనైనా, “యా బహా ఉల్ అభా” నినాదా న్నిస్తూ నగరాలలోనూ, గ్రామాలలోనూ, ఎడారులలోనూ, మహాసముద్రాలలోనూ, దైవ బోధనలను ప్రచారం గావిస్తూ ఈ ప్రాంతాలకు పయనించగలిగాను! అయ్యో, నేనిది చేయజాలను. ఇందులకెంతో చింతిస్తున్నాను! భగవంతుని సంప్రీతుని గావింపుడు, దీనిని మీరు సాధింపవచ్చును.
ఈ సమయానికి, కుమారి అలెగ్జాండర్ యత్నములతో, హవాయియన్ దీవుల యందలి పలువురు - విశ్వాస సాగరతీరమును సమీపించినారు. పరికింపుడు, ఎంతటి ఆనందమది, ఎట్టి ఆహ్లాదమది! ఈ మాన్యనందిని ఏకముగా ఒక సామ్రాజ్యమునే స్థాపించి యుండిననూ, ఆ సామ్రాజ్య మింతటి మహత్తరమై యుండదని దివ్యసేనాధీశుని పేరిట ప్రకటింపుచున్నాడను. ఎందులకనగా, శాశ్వతసార్వభౌమత్వ మీసార్వభౌమత్వము, నిత్యవైభవ మీవైభవము.
ఆ విధముగనే, బోధకులు కొందరు ఆస్ట్రేలియా ఖండము, న్యూజీలండ్, తస్మానియా, జపాన్, ఏషియాటిక్ రష్యా, కొరియా, ఫ్రెంచి ఇండోచైనా, సయామ్, స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్, ఇండియా, సిలోన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి అన్యద్వీపములకూ, దేశములకూ వెళ్లినట్లైతే మహత్తర ఫలితములు సిద్ధింపగలవు. స్త్రీ పురుష సమన్విత మైన రాయబారబృంద మేదేని - చైనా, జపాన్లకు పయనించగల అవకాశమున్నచో ఎంత బాగుండును! ఈ అనురాగబంధ మీతీరున పటిష్టతను సంతరించుకొన వచ్చును, ఈ రాకపోకలతో వారు మనుష్యప్రపంచపు టేకత్వమును స్థాపింపవచ్చును, జనులను భగవంతుని దివ్యసామ్రాజ్యమున కాహ్వానించి, బోధనలను పరివ్యాప్త మొన రింపవచ్చును.
అలాగే, వీలైతే, వారు ఆఫ్రికా ఖండమునకూ, క్యానరీ ఐలండ్స్, కేప్ వెర్డీ ఐలండ్స్, మెడియేరా ఐలండ్స్, రీయూనియన్ ఐలండ్స్, సెయింట్ హెలీనా, జాంజి బార్, మారిషస్ లకూ వెళ్లి, ఆయా దేశాల ప్రజలను భగవంతుని దివ్యసామ్రాజ్యమునకు ఆహ్వానిస్తూ, “యా బహా ఉల్-అభా” నినాదము నీయవలె. మడగాస్కర్ దీవిలో సైతము మానవప్రపంచపు టేకత్వ పతాకమును వారు తప్పక ఎగురవేయవలె.
అబ్దుల్-బహా తాను తీవ్రమైన శారీరక బలహీనతతో, అశక్తతతో, అయిష్టతతో, కదలజాలని నిస్సహాయస్థితిలో ఉండికూడా - ఈ పరిస్థితిని లక్ష్యము సేయక, అనేక దేశములయందునా, ఐరోపా, అమెరికాలలోనూ పర్యటించుటనూ; చర్చీలలో, సభలలో, సమ్మేళనములలో దివ్యసూత్రప్రచార నిమగ్నుడై, అభా దివ్యసామ్రాజ్యావతారము వంకకు ప్రజల నామంత్రించుటనూ మీరు గమనించినారు. శుభసంపూర్ణుని ఆశీస్సులు సర్వులనూ సమావృత మొనరించుటను సైతము మీరు పరికించినారు. భౌతిక విశ్రాంతితో, ప్రశాంతతతో, సౌఖ్యముతో, ఈ ఐహికప్రపంచ వ్యామోహముతో చేకూరెడు ఫలితమేమి? వీటిని వెన్నంటిపోవు మానవుడు తుదకు పశ్చాత్తప్తుడై నష్టము నొందుట తధ్యము.
పరికింపుడు! మనిషి ఈ లోకమున ఎంతటి సిరిసంపదలనూ, సౌభాగ్యమునూ సముపార్జించుకున్ననూ - ఒక ఆవు వలె స్వతంత్రుడు కాబోడు. ఎందులకనగా, పుష్టిని సంతరించుకొనిన ఈ ఆవులు విశాలమైన పచ్చికమైదానము లలో స్వేచ్ఛగా సంచరిస్తాయి. అన్ని గడ్డిభూములూ, పచ్చికబయళ్లూ అవి మేసేందుకే, నదులూ, నీటిచెలమలూ అన్ని అవి త్రాగేందుకే! వాటికి, ఈ పుష్కలతరమైన ప్రాపంచిక వరములు లభించిన వనునది ప్రత్యక్ష నిదర్శనం.
ఇంతకన్ననూ ఉత్తమమైనది - పక్షి జీవితము. రాజభవనములను తలదన్నిన రమ్యతరమైన కులాయము (గూడు)ను పర్వత శిఖరాగ్రానా, ఎంతో ఎత్తున ఊగిసలాడే శాఖలపైనా నిర్మించుకుంటుంది పక్షి! ఎంతో పరిశుభ్రమైన గాలి, స్ఫటికసదృశమైన స్వచ్ఛమైన చల్లని నీరూ, సుమనోహర సుందర పర్యావరణమూ. అంతటి మనోజ్ఞ పరిసరాల మధ్యన అది తన పరిమిత జీవితాన్ని వెళ్లబుచ్చుతుంది. మైదానంలో పండే పంట దిగుబడులన్నీ దాని ఆస్తులే; ఇదంతా అది — కాస్తంత శ్రమైనా లేకుండా సంపాదించుకున్నదే. కనుక, మనిషి ఈ ప్రపంచములో ఎంతో పురోగమించి ఉండవచ్చును గాక; ఈ పక్షి స్థాయిని మాత్రం అందుకొనజాలడు! కనుక, తాను మరణించేంత వరకూ, ప్రాపంచికాంశములయం దెంతగా కష్టించి, కృషి చేసినా ఒక చిన్న పక్షికి గల సమృద్ధినీ, స్వేచ్ఛనూ, స్వతంత్ర జీవితమునూ మానవుడు సాధించజాల డన్నది విస్పష్టం. ఇది నిజమును నిరూపిస్తున్నది, నిలుపుతున్నది. మానవుడు సృష్టించబడినది ఈ నశ్వర ప్రాపంచిక జీవితం నిమిత్తం కాదు - అయితే, మరి అతను సృజించబడినది - సర్వసమగ్రతల సముపార్జనకూ, మానవప్రపంచమున సమున్నత స్థాయీసాధనకూ, దివ్యగేహళీ సామీప్యత నొందేం దుకూ, అనంత సార్వ భౌమాధికార సింహాసనాసీనుడు కావడానికీ మాత్రమే!
ఓ దేవా, నా దేవా! నీ ఘనసామ్రాజ్యముతో ముగ్ధతనొంది, తదాకర్షితుడనై, మానవాళియందున నీ ప్రేమాగ్నితో ప్రజ్జ్వలితుడనై, ఈ సువిస్తృత, సువిశాలభూములకు నీ సామ్రాజ్యదూతనై, నీవు దక్క అన్యసమస్తముతోనూ బంధములను త్రెంచుకుని, నిన్ను విశ్వసించి, విశ్రామసౌఖ్యములను పరిత్యజించి, నిజగృహదూరుడనై, ఈ ప్రాంతములయందున ద్రిమ్మరినై, భువిపై బడిన అపరిచితుడనై, నీ మహాద్వారసీమ యెదుట సాగిలపడి, నీ సర్వశక్తిసమన్విత స్వర్గవిధేయుడనై, నీ దివ్యధర్మమును సేవించుట యందున, నీ బోధనలను దూరభూములకు పరివ్యాప్త మొనరించుట యందున, ప్రాక్పశ్చిమములలో నీ దివ్యవచనమును సంకీర్తించుట యందున నాకు తోడ్పడు మని నిశిరేయినా, ప్రభాతసమయానా నిన్ను వేడుచూ, ఉదయ సాయం సంధ్యల యందున నిన్నర్ధింపుచూ, ప్రస్తుతింపుచున్న నన్ను వీక్షింపుచున్నాడవు.
[యునైటెడ్ స్టేట్స్, కెనడాల బహాయిల నుద్దేశించి 1917 సం. మార్చి 8 న హైఫాలో అబ్దుల్-బహా నివాసంలోని వేసవి గది (ఇస్మాయిల్ అఖా గది) లో దీనిని వెలువరించడం జరిగింది.]
కనుక, యునైటెడ్ స్టేట్స్, కెనడాలకు చెందిన భగవద్విశ్వాసులారా! అలాస్కా అంతటా, మెక్సికో రిపబ్లిక్కులోనూ, గ్వాటెమాలా, హాండూరస్, సాల్వడార్, నికారాగ్వా, కోస్ట రీకా, పనామా, బెలిజా వంటి మధ్య అమెరికన్ రిపబ్లిక్కులలోని దక్షిణ మెక్సికోకూ; అర్జెంటీనా, ఉరుగ్వయ్, పరగ్వయ్, బ్రెజిల్, ఫ్రెంచ్ గియానా, డచ్ గియానా, బ్రిటిష్ గియానా, వెనిజులా, ఈక్వడోర్, పెరూ, బోలీవియా, చిలీ వంటి దక్షిణ అమెరికన్ రిపబ్లిక్కుల వ్యాప్తంగానూ; క్యూబా, హెయ్తీ, పోర్టో రికో, జమైకా, సాంటో డొమింగో వంటి వెస్ట్ ఇండీస్ ద్వీప సముదాయంలోనూ, లెస్సర్ అంటిలీస్, బహామా, బెర్మూడా ద్వీపాల సముదాయాలలోనూ; అలాగే, దక్షిణ అమెరికాకు ఉత్తర, పశ్చిమ ద్వీపాలైన ట్రినిడాడ్, ఫౌక్లాండ్ ద్వీపాలకూ, గలాపగోస్ ద్వీపాలకూ, హ్వన్ ఫెర్నాండెజ్, టొబాగోలకూ పర్యటించేందుకై ముఖ్యులను ఎంపికైనా చేయండి, లేని పక్షంలో - వారు ఇతరులనుండీ, ప్రపంచ నిర్లిప్తతనుండి తెగతెంపులు చేసుకుని తమంతతాముగా ఉద్యమించినా సరే. ప్రత్యేకించి, బ్రెజిల్ తూర్పుతీరాన వున్న బహియా నగరాన్ని సందర్శించండి. ఎందులకనగా, గతంలో ఈ నగరానికి బహియా పేరిట నామకరణము చేయనైనది; ఇది నిస్సంశయముగా పవిత్రాత్మస్ఫూర్తితోనే జరిగినది.
ఆ కారణముగా, భగవద్విశ్వాసులు గరిష్ఠముగా కృషిని సలువపలె, ఆ ప్రాంతములయం దెల్లెడలా దివ్యగీతిక నాలపింపవలె, దివ్యబోధనల నుద్ఘోషించి, సర్వజనులపైననూ అమరజీవనస్ఫూర్తిని ప్రసరింపచేయవలె; తద్వారా ఆ రిపబ్లిక్కులు అన్యదేశముల ప్రశంసకూ, మెప్పునకూ లక్ష్యము లగునంతగా, సత్యసూర్యుని తేజోప్రభలతో దీప్తి మంతములు కావచ్చును. ఆ విధముగనే, పనామా రిపబ్లిక్కు పట్లనూ మీరు విశేషశ్రద్ధను వహింపవలె. ఎందులకనిన, ప్రాక్పశ్చిమములు అక్కడ- పనామా కాలువ ద్వారా - పరస్పరం ఒక్కటౌతున్నాయి. అంతియగాక, అది రెండు మహా సముద్రములకు మధ్యన ఉన్నది. భవిష్యత్తులో ఆ ప్రాంతమెంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. బోధనలు కనుక, అక్కడ ఒకసారి నెలకొనడమంటూ జరిగిన పక్షంలో అవి - తూర్పు పడమరలనూ ఉత్తర దక్షిణములనూ మమేకం గావిస్తాయి.
సమస్తప్రవక్తలూ దేనిని ప్రబోధింప నవతరించిరో, దైవబోధనలకు స్ఫూర్తి ఏదో - ఆ పవిత్రమతముల సమష్టి కేంద్రము - అమెరికాలోని అన్ని ప్రాంతములకూ విస్తరించునటుల మీరిప్పుడు కృషి సల్పుడు, తద్వారా మీయందలి ప్రతి ఒక్కరూ వాస్తవికతా దిఙ్మండలమునుండి ప్రభాతనక్షత్రములవలె ప్రకాశింపవచ్చును, దైవశోభ ప్రాకృతి కాంధకారమును జయింపవచ్చును, మనుష్యప్రపంచము జ్ఞానము నొంద వచ్చును. మహత్కార్యమిది! అందున మీ రనుగ్రహీతులైనచో, ఈ ప్రపంచ మింకొక ప్రపంచమై, అవనీతలము రమ్యతరస్వర్గమై, శాశ్వతవ్యవస్థలు సంస్థాపితములు కావచ్చును.
ఓ దేవా! ఓ దేవా! నీ ప్రాణుల యెదుట నా ఆశక్తతను, హైన్యతను, విధేయతను విలోకింపుచున్నాడవు; అయినను, నీయందున విశ్వాసమునుంచి, నీ యధికార, బలములపై ఆధారితుడనగుచూ నీ సుదృఢసేవకుల యందున నీ బోధనల పరివ్యాపనముకై ఉద్యమించినాను.
ఓ ప్రభూ! నేనొక రెక్కలు విరిగిన పక్షిని, అయినను నీ అనంతాంతరిక్షమున విహరింప నెంచితిని. నీ దివ్యేచ్ఛాకారుణ్యములు, నీ అనుగ్రహసాహాయ్యముల మూలమున దక్క, నా కెటుల సాధ్యమిది.
ఓ ప్రభూ! బలహీనతమ జీవిని పవిత్రాత్మనిశ్వాస మనుగ్రహించినచో, ఆతడు తన అపేక్షితముల నన్నింటినీ అందుకొనును, తా నాశించు దేనినైనను పొందును. నిక్కముగ, నీవు గతమున నీ సేవకులకు సహకరించినావు; వారు నీ ప్రాణులలో దుర్బలతములూ, నీ సేవకులయందున హీనతములూ, భువిపై వసియించినవా రందరికన్ననూ సామాన్యతములూ అయిననూ, నీ అనుమతముతో, అధికారముతో, నీ ప్రజలలోని పరమ యశస్వులకన్ననూ, మానవాళియందలి మహోదాత్తులకన్ననూ ఆగ్రస్థానము నొందినారు. నీ అనుగ్రహ, కారుణ్యముల వలన - గతమున వారు శలభములై యుండినను, రాచడేగలైనారు, పూర్వము వారు సెలయేళ్లై యుండినను, సాగరములైనారు. వారు నీ మహోత్కృష్ట కృపతో, మార్గదర్శన దిఙ్మండల ప్రకాశిత నక్షత్రములు, అమరత్వపు గులాబీ ఉపవన గాయక విహంగములు, విజ్ఞాన, విజ్ఞతారణ్యములయందున గర్జించు సింగములు, జీవసాగరతరణము గావించు తిమింగిలములు అయినారు.
[కెనడా – అంటే న్యూ ఫౌండ్లాండ్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలండ్, నోవా స్కోటియా, న్యూ బ్రన్స్విక్, క్విబెక్, సాస్కట్కెవన్, మనిటోబా, అంటారియో, అల్బర్తా, బ్రిటిష్ కొలంబియా, యుకాన్, మెకంజీ, కీవాటిన్, ఉంగావా, ఫ్రాంక్లిన్ ఐలండ్స్– గ్రీన్ల్యాండ్ నివాసులైన బహాయిలకు 1917 సం. ఫిబ్రవరి 21న అక్కాలో అబ్బుద్ గృహంలోని బహాఉల్లా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
మహనీయ ఖురాన్లో, భగవంతుడు ఇట్లనుచున్నాడు: “భగవంతుని జీవుల యందున నీవెట్టి భేదమునూ చూడవలదు.”1 వేరొక తీరున చెప్పవలెనంటే, సముచిత దృక్కోణమున వీక్షించినచో ఆయన ప్రాణులయందున వ్యత్యాస మేదియూ లేదు, ఏలయనిన - అవి యన్నియూ తాను సృజించినవే నంటున్నా డాయన. పై ప్రాతిపదికన - దేశముల మధ్యన భేదములు లే వను నిర్ణయమునకు రావడమైనది. కాగా, కెనడా రాజ్యభవిత ఎంతయో మహత్తరము; తత్సంబంధిత సంఘటన లత్యంత ప్రసిద్ధములు. భగవత్కటాక్ష వీక్షణమున కిదియే లక్ష్యము కావలె; సమస్త యశస్వి అనుగ్రహముల నభివ్యక్తము సేయవలె.
ఆ రాజ్యపర్యటనమునా, ఆయా మజిలీలయందునా అబ్దుల్-బహా ఎంతయేని ఆనందము ననుభవించినాడు. నేను మాంట్రియల్ కు బయలుదేరడానికి ముందు, అక్కడి నివాసులయం దధిక సంఖ్యాకులు క్యాథలిక్కులనీ, పరమఛాందసులనీ; అనుకరణల సముద్రమున మునిగియున్నారనీ, భగవంతుని దివ్యసామ్రాజ్యాహ్వానము నాలకించు శక్తి వారికి లేదనీ, మహత్తర మార్గదర్శన సంకేతములను వీక్షించలేనంతగా, మతోన్మాదపు తెరలు వారి నేత్రములను కప్పివేసినవనీ, సత్యమున కిసుమంతైనా తా వీయక, పూర్తిగా వితండవాదములు ఆక్రమించుకొని ఉన్నాయనీ చెబుతూ – అక్కడికి వెళ్లవలదని నన్నెందరో హెచ్చరించినారు. సత్యసూర్యుడు ఆ రాజ్యవ్యాప్తముగా సంపూర్ణవైభవముతో భాసిల్లవలెననిన, మూఢవిశ్వాసము లనబడు దుర్భేద్యకాలమేఘము లాసూర్యకిరణముల విలోకన మెవరికైననూ అసాధ్యమే నను నంతగా, దిఙ్మండలము నావరించుకుని యున్నవని వారు నొక్కి చెప్పడం జరిగింది.
అయితే, ఈ కథలు అబ్దుల్-బహా నిర్ణయము నేవిధముగానూ ప్రభావితము గావించలేకపోయినవి. భగవంతునియందున విశ్వాసమునుంచి, మాంట్రియల్ దెసకు తన దృష్టిని సారించినా డాయన. తా నానగరము లోనికి ప్రవేశించినప్పుడు ద్వారములన్నీ తెరుచుకునే ఉన్నాయని ఆయన గమనించినాడు; హృదయము లత్యంత సానుకూలదృక్పథ సమన్వితములై యున్నవనీ, భగవంతుని దివ్యసామ్రాజ్య మహోత్కృష్టశక్తి ప్రతి అవరోధమునూ, ఆటంకమునూ తొలగించి వేస్తున్నదనీ గుర్తించి నాడాయన. ఆ రాజ్యపు చర్చీలలోనూ, సమావేశములలోనూ – అమితానందముతో - ప్రజలను భగవంతుని దివ్యసామ్రాజ్యమున కాహ్వానించి, దైవశక్తిహస్తము నీరుపోసి సాగుచేయు బీజములను చల్లినా డాయన. అవి నిస్సందేహముగా మొలకలై, హరితసమృద్ధములై, పుష్కలమగు పంటదిగుబడు లెన్నియేని లభ్యమగును. దివ్యసూత్రముల ప్రబోధమున - ఏ విరోధియూ, ఏ ప్రత్యర్ధియూ ఆయన కగుపించ లేదు. ఆ నగరమునం దాయన కలుసుకొనిన విశ్వాసు లత్యంత ధార్మికహృదయులై, భగవత్సౌరభములకు సమాకర్షితులై ఉన్నారు. ఈ మహదానందమును దినదిన ప్రవర్ధమానము గావిస్తూ - భగవత్సేవిక శ్రీమతి మ్యాక్స్వెల్ కృషితో - ఆ రాజ్యములోని భగవత్సామ్రాజ్య నందినీనందనులెందరో సమీకృతులై, పరస్పర సాన్నిహిత్యము నొందినారు. అక్కడి మజిలీ కొద్ది దినములకే పరిమితమైనా, భవిష్యత్పర్యవసానము లపరిమితములై ఉన్నాయి. సేద్యము సేయబడని భూమికి తాను స్వామి అయి నప్పుడు, కర్షకుడు - స్వల్పకాలమునకే సువిశాలక్షేత్రమును సాగులోనికి తీసుకు వస్తాడు. కనుక, భవిష్యత్తులో ఈ రాజ్యమునుండి దివ్యసామ్రాజ్యగీతిక ప్రపంచదేశము లన్నింటికీ పరివ్యాప్తమయ్యేలా, పవిత్రాత్మ నిశ్వాసము లాకేంద్రమునుండి ప్రాక్పశ్చిమ అమెరికాలకు విస్తరించేలా - మాంట్రియల్ మరింతగా ఉత్తేజిత మగునని ఆశింతును.
ఓ నా దేవా, నీకు ప్రస్తుతి! వీరు నీ కారుణ్యసౌరభములకు సమాకర్షితులూ, నీ ఏకత్వవృక్షమున జ్వలియించు అగ్నిచే ప్రజ్జ్వలితులూ, నీ ఏకత్వ సైనాయిలో భాసిల్లు దీపప్రభల సంవీక్షణతో జ్యోతిర్మయనేత్రులూ అయిన సేవకులు.
ఓ ప్రభూ! నీ ప్రజలయందున నీ ప్రస్తావన మొనరించుటకై వారి జిహ్వలకు స్వేచ్ఛ నిమ్ము, నీ కృపతో, సాదరకారుణ్యముతో నీ సంకీర్తనమును సేయనిమ్ము, నీ దేవదూతలసేనతో వారికి తోడ్పడు, నీ సేవలో వారి కటిసీమలను దృఢీకరించు, వారిని నీ జీవులయందున నీ మార్గదర్శక సంకేతములను కానిమ్ము.
ఓ దేవా, నా దేవా! అలౌకిక శక్తికై అర్ధింపుచున్న ఈ శక్తిహీనుని, నీ స్వర్లోక సంపదలకై తపియింపుచున్న ఈ దీనుని, అమరజీవన ప్రస్రవణము నాకాంక్షింపుచున్న ఈ పిపాసువుని, నీ ఊర్ధ్వస్థిత సామ్రాజ్యమున నీ నియుక్త సేవకులకై నీవు లక్షించిన నీ అనంతకారుణ్యముతో నీ వాగ్దత్తచికిత్స నపేక్షింపుచున్న ఈ ఆర్తుని వీక్షింపుచున్నాడవు.
ఓ ప్రభూ! నాకు నీవు దక్క సాహాయ్యుడు లేడు, నీవు గాక వేరొండు ఆశ్రయణము లేదు, నీవు తప్ప వేరొక పరిపోషకుడు లేడు. నీ వెంచుకొనిన నీ జనుల యందున నీ పవిత్రసౌరభములను సువిస్తృతముగ పరివ్యాపన మొనరించుటలో, నీ దేవదూతలతో నాకు సాయపడు.
ఓ నా ప్రభూ! నీనుండి దక్క అన్య మంతటినుండియు నేను విముక్తుడనై, నీ అనుగ్రహ వస్త్రాంచలమును దృఢముగ చేబూని, నీ దివ్యధర్మమునకు సంపూర్ణముగ అంకితుడనై, నీ ప్రేమయందున సుదృఢముగ, సుస్థిరముగ నిలచి, నీవు నీ దివ్య గ్రంథమున విధియించిన దానిని పాలించునటు లొనరింపుము.
[యునైటెడ్ స్టేట్స్ లోని పన్నెండు మధ్య రాష్ట్రాలు: మిషిగెన్, విస్కాన్సన్, ఇలినోయీ, ఇండియాన, ఒహాయో, మినెసోట, అయ్వా, మిజోరీ, నార్త్ డకోట, సౌత్ డకోట, నెబ్రాస్క, కాన్సస్ ల నివాసులైన బహాయిల నుద్దేశించి, 1917 సం. ఫిబ్రవరి 8న అక్కాలో అబ్బుద్ గృహంలోని బహాఉల్లా గదిలో దీనిని వెలువరించచడం జరిగింది.]
యునైటెడ్ స్టేట్స్ లోని ఈ పన్నెండు మధ్యరాష్ట్రాలూ అమెరికాకు హృదయము వంటివి; మానవుని సర్వావయవములకూ హృదయము అనుసంధానితమై ఉంటుంది. హృదయము బలపడితే సమస్త శరీరభాగములూ శక్తిసమన్వితములై, సత్త్వమును సంతరించుకుంటాయి, హృదయము బలహీనమైతే సమస్త శరీరాంగములూ దౌర్బల్యమునకు లోనౌతాయి.
ఐదవది: అమెరికాలో తొలి మష్రికుల్-అఝ్కార్ షికాగోలో సంస్థాపితమైనది, అమూల్యము లాగౌరవప్రతిష్ఠలు. ఈ మష్రికుల్-అఝ్కార్ నుండి, నిస్సందేహముగా, వేలకొలదీ మష్రికుల్-అఝ్కార్ ల ఆవిర్భావము జరుగుతుంది.
ఆ విధముగనే, షికాగోలో - సార్వత్రిక వార్షిక సదస్సులూ, ది స్టార్ ఆఫ్ ది వెస్ట్ సంస్థాపనా, దివ్యఫలకముల ప్రచురణా, అమెరికాలోని అన్ని ప్రాంతములలోనూ వాటి వితరణలకై పబ్లిషింగ్ సొసైటీ ఏర్పాటూ జరిగినవి, భగవంతుని దివ్యసామ్రాజ్య స్వర్ణ శతాబ్ది వార్షికోత్సవ నిర్వహణకు ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ దివ్యోత్సవమూ, ఈ దివ్యప్రదర్శనమూ అత్యంత నిర్దుష్టతతో జరుపుకొనబడునని, తద్వారా, “ఏకేశ్వరుడు దక్క వేరుదైవము లేడు, ఆది నుండి ప్రవక్తృత్వ ముద్రయైన మహమ్మదు వరకూ పంపబడిన సమస్త దివ్యవార్తావహులూ సత్యస్వరూపి యానతిన యేతెంచినా,” రను ప్రపంచ సమైక్యతాహ్వానము వెలువడవచ్చునని; మనుష్యప్రపంచపు టేకత్వపతాక మావిష్కృతమై, విశ్వశాంతి మధురగీతిక ప్రాక్పశ్చిమముల వీనులను జేరి, మార్గములన్నియూ నిర్నిరోధితములై, అవక్రములై, హృదయములన్నియూ భగవత్సామ్రాజ్య సమాకర్షితములై, అమెరికా శిఖరాగ్రమున సమైక్యతాపటవేశ్మము సంస్థాపితమై, సమస్త దేశములనూ, ప్రజలనూ భగవంతుని ప్రేమగీతిక హర్షోల్లసితులను సేయగా, ధరణీతలము అమరధామమై, కాలమేఘములు పారద్రోలబడి, సత్యసూర్యుడు సంపూర్ణ తీక్ష్ణతతో భాసిల్లవచ్చునని ఆశిస్తున్నాను.
ఓ భగవన్మిత్రులారా! మనఃపూర్వకముగ యత్నింపుడు, తద్వారా, హృదయముల మధ్యన సహవర్తన, వాత్సల్యము, సమైక్యత, ఏకీభావములు సాధింపబడ వచ్చును, లక్ష్యములన్నియూ ఒకే లక్ష్యము కావచ్చును, గీతిక లన్నియూ ఒకే గీతిక కావచ్చును, సమస్త ప్రాకృతిక ప్రపంచశక్తులనూ అధిగమించు నంతటి మహత్తర విజయమును పవిత్రాత్మశక్తి సాధింపవచ్చును. పరిశ్రమింపుడు; మీ లక్ష్యము అనిర్వచనీయ వైభవప్రపూరితము. విజయము మీ కృషికి మకుటమైనచో, అమెరికా - ఆధ్యాత్మిక శక్తితరంగముల ప్రాదుర్భావకేంద్రముగా తప్పక పరిణామము చెందును. తన అనంత యశోవైభవములతో భగవంతుని దివ్యసామ్రాజ్యసింహాసనము సుదృఢముగ ప్రతిష్ఠిత మగును.
ఈ అసాధారణ ప్రపంచము మార్పునకు లోనుకాని స్థితియందున స్వల్పకాలమైననూ ఉండదు. క్షణక్షణము నకూ మార్పుచెందుతూ, పరివర్తితమగుచునే యుండు నిది. అంత్యమునకు ప్రతి పునాదీ కదలి, ప్రతి శోభావైభవమూ కనుమరుగై, అదృశ్యత నొందును; అయితే భగవత్సామ్రాజ్యము నిత్యము; స్వర్లోక సార్వభౌమత్వ ప్రాభవములు సుస్థిరములు, శాశ్వతములు. కనుక, ఒక జ్ఞాని దృష్టిలో: ప్రపంచ ప్రభుత్వ సింహాసనమున కన్ననూ భగవత్పామ్రాజ్యమున యున్న చాపకే ప్రాథమ్యత.
భగవత్ప్రేమ ప్రభాతస్థలులూ, పవిత్రీకరణ, పావనత్వముల క్షితిజతారలూ, ఇంకా ఈ అంధకారమయ విశ్వమును తేజోమయ మొనరించి, ఈ జీవరహిత ప్రపంచమునకు ప్రాణదాతలూ అయిన కొందరు ధన్యజీవుల మధురగానము - బహుశః నాకు వినవచ్చునేమోయని నా కన్నూ, చెవీ మధ్య రాష్ట్రముల వైపునకే నిరంతరమూ సారింపబడి ఉంటాయి. అబ్దుల్-బహా ఆనందము దీనిపైననే ఆధారితమైనది! ఇందున మీ రనుగ్రహీతులు కాగల రని ఆశింతును.
ఓ ప్రభూ, నా దేవా! నీవు నన్ను సామ్రాజ్యమహాపథమునకు మరలించి, నన్ను ఈ అవక్ర, ఋజుమార్గమున పయనింపచేసి, నీ తేజఃప్రభాస వీక్షణముతో నా కంటికి వెలుగునిచ్చి, మార్మికసామ్రాజ్య పావనవిహంగముల మధురగానముల వంకకు నన్ను చెవియొగ్గజేసి, ధార్మికులయందలి నీ ప్రేమతో నా హృదయము నాకర్షించి నందులకు నీకు ప్రస్తుతి, కృతజ్ఞతా సమర్పణములు.
ఓ ప్రభూ! నేను బలహీనుడను, నీ శక్తిసత్త్వములతో నన్ను సశక్తీకరించు, నా జిహ్వ తొట్రువడుచున్నది, నన్ను నీ స్మరణాప్రస్తుతులను గావింపనిమ్ము, అధముడను, నీ సామ్రాజ్యములోనికి న న్ననుమతించి ఆదరించు, దూరస్తుడను నీ కారుణ్య ద్వారము దరి జేరనిమ్ము.
ఓ ప్రభూ! నన్నొక సముజ్జ్వలజ్యోతిని, శోభయమాన తారకను, ఈ ప్రాంతముల నన్నింటినీ తన శాఖలతో సమాచ్ఛాదించు ఫలయుత ధన్యవృక్షమును గావింపుము. నిక్కముగా, నీవు శక్తిశాలివి, అధికారపరిపూరితుడవు, నిర్నిరోధితుడవు.
[యునైటెడ్ స్టేట్స్ లోని పదకొండు పశ్చిమ రాష్ట్రాలు: న్యూ మెక్సికో, కొలరాడో, అరిజోనా, నెవాడ, కాలిఫోర్నియా, వయోమింగ్, యూటా, మంటానా, ఐడహో, ఓరెగన్, వాషింగ్టన్ ల నివాసులను ఉద్దేశించి 1917 సం. ఫిబ్రవరి 15న అక్కాలో అబ్బుద్ గృహంలోని బహాఉల్లా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఆశీఃకృతమైన కాలిఫోర్నియా రాష్ట్రమునకూ, పవిత్రభూమికీ - అనగా పాలస్తీనా దేశమునకూ -- ఎంతో సారూప్యత ఉన్నది. అక్కడి గాలి అత్యంత సమశీతలమై, పీఠము సువిశాలమై ఉంటాయి, పాలస్తీనా ఫలము లెంతో నవనవలాడుతూ, నాజూకుగా ఉంటాయి. ఆ రాష్ట్రములలో పర్యటిస్తున్నప్పుడు తాను పాలస్తీనాలో ఉన్నట్లే అనుభూతిని చెందినాడు – అబ్దుల్-బహా; ఎందులకనగా ఈ ప్రాంతమునకూ ఆ రాష్ట్రమునకూ ప్రతి కోణంలోనూ మంచి పోలిక ఉన్నది. పసిఫిక్ సముద్రతీరములు సైతం, కొన్ని సందర్భములలో, సంపూర్తిగా పవిత్రభూమి తీరములను తలపిస్తాయి; పవిత్రభూమిలోని వృక్షజాలమూ ఆ తీరములలో అభివృద్ధి చెందినదే. ఈ అనుశీలన మత్యద్భుతమూ, ఆశ్చర్యజనకమూ కూడ.
అదే విధముగా కాలిఫోర్నియాలోనూ, తక్కిన పశ్చిమ రాష్ట్రములయందునా, మానవమేధలను మంత్రముగ్థము గావించు ప్రాకృతిక ప్రపంచపు టద్భుత దృశ్యములు గోచరిస్తాయి. బృహత్పర్వతములూ, లోతైన లోయలూ, మహోత్తుంగ జలపాతములూ, మహావృక్షములూ అన్నిచెరగులా అగుపిస్తాయి, ఇక దాని నేల అత్యంత సారవంతమూ, సర్వసమృద్ధమూ. ఆశీఃకృతమైన ఆ రాష్ట్రము పవిత్రభూమి వంటిదే; ఆ ప్రాంతమూ, ఆ జనపదములూ మనోహర స్వర్గతుల్యములే. పలు విధములుగా అది పాలస్తీనా వంటిదే. ప్రాకృతిక సారూప్యతలున్నవి కనుక, ఇప్పుడిక, దివ్యత్వ సారూప్యతలు సైతము సాధింపబడవలె.
కాలిఫోర్నియా, తక్కిన పశ్చిమ రాష్ట్రములూ - పవిత్రభూమితో ఇప్పుడు మరింత చక్కని సారూప్యతను సంతరించుకొనవలె, ఆ రాష్ట్రమునుండి, ఆ ప్రాంతమునుండి అమెరికా, ఐరోపాలకు పవిత్రాత్మ నిశ్వాసములు విస్తరింపవలె; తద్వారా – భగవంతుని దివ్యసామ్రాజ్యాహ్వానము, సమస్త శ్రవస్సులకూ సంతసోల్లాసములను కలిగింప వచ్చును, దైవసూత్రములు నవజీవనము ననుగ్రహించవచ్చును, భిన్నపక్షము లేకపక్షము కావచ్చును, వైమనస్య భావన లంతరించి ఒకే విశిష్టకేంద్రము చుట్టూ పరిభ్రమణ మొనరింపవచ్చును, ప్రాక్పశ్చిమ అమెరికాలు పరస్పర మాలింగన మొనరించుకొన వచ్చును, మానవప్రపంచ సమైక్యతాగీతిక మానవబాల లెల్లరకూ నవచేతనను ప్రసాదింప వచ్చును, విశ్వశాంతి పటవేశ్మము అమెరికా శిఖరాగ్రమున ప్రతిష్ఠితము కావచ్చును; ఆ విధముగా ఐరోపా, ఆఫ్రికాలు పవిత్రాత్మ నిశ్వాసములతో చైతన్యము నొందవచ్చును, ఈ ప్రపంచ మింకొక ప్రపంచము కావచ్చును, రాజ్యవ్యవస్థ నూతనోల్లాసము నొందవచ్చును, ప్రాకృతికప్రపంచపు టద్భుతదృశ్యములు కాలిఫోర్నియా రాష్ట్రములో వలె, తక్కిన పశ్చిమ రాష్ట్రములలో వలె ప్రత్యక్షములూ, ప్రస్ఫుటములూ కావచ్చును, భగవంతుని దివ్యసామ్రాజ్య బృహత్సంకేత ములు సైత మభివ్యక్తములై, తద్వారా దేహము ఆత్మకు ప్రతిరూపము కావచ్చును. బాహ్యప్రపంచము మనో ప్రపంచమునకు ప్రతీక కావచ్చును, భూమియను అద్దము స్వర్లోక సుగుణములను ప్రతిఫలించు దివ్యసామ్రాజ్య దర్పణము కావచ్చును.
ఆ ప్రాంతములలో నా పయన, పర్యటనల సందర్భమున మహాద్భుత ప్రాకృతిక ప్రదేశములనూ, సువిస్తృత విహంగవీక్షణ దృశ్యములనూ, ఉద్యానములనూ, వాహినులనూ వీక్షించినాడను; జాతీయ పార్కులూ, సార్వత్రిక సమావేశములూ; ఎడారులూ, మైదానములూ, పచ్చికబయళ్ళూ; ఇంకా ఆ ప్రాంతీయ ధాన్యములూ, ఫలములూ నా దృష్టి నెంతో ఆకట్టుకున్నాయి; ఈ క్షణము వరకూ నా మదిలో నిలిచే ఉన్నాయి.
ప్రత్యేకించి, శాన్ఫ్రాన్సిస్కో, ఓక్లండ్ లలో జరిగిన సభలతోనూ, లాస్ ఏంజెలెస్ లో జరిగిన సమావేశములతోనూ, అన్యరాష్ట్ర విశ్వాసులతోనూ నేనెంతో సంతుష్టుడనైనాను. వారి ముఖసీమలు లెప్పుడు స్ఫురణకు వచ్చినా, అప్పటికప్పుడు నాకు అంతులేని ఆనందం కలుగుతుంది.
ఓ ప్రభూ! నేను అసహాయుడను, ఏకాంతవర్తనుడను, అధముడను. నాకు నీవు దక్క సహాయకుడు లేడు. నాకు నీవు దక్క వేరొక పరిపాలకుడు లేడు. నీ సేవలో నన్ను దృఢపరచు. నీ దేవదూతాగణములతో నాకు తోడ్పడు. నీ దివ్యప్రవచన విస్తరణలో నాకు విజయము నొనగూర్చు. నీ ధర్మాన్ని నీ ప్రజలతో ప్రసంగించేందుకు నాకు అనుమతిని ప్రసాదించు. నిశ్చయంగా, నీవు అశక్తుల సహాయకుడవు, అల్పుల సంరక్షకుడవు; నిశ్చయముగా, నీవు అధికారపూరితుడవు, శక్తిమంతుడవు, నిర్నిరోధితుడవు.
[యునైటెడ్ స్టేట్స్ లోని పదహారు దక్షిణాది రాష్ట్రాలు: డెలవేర్, మేర్లండ్, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, నార్త్ కరొలైనా, సౌత్ కరొలైనా, జార్జియా, ఫ్లారిడా, అలబేమ, మిసిసిపి, టెనెసీ, కెంటకీ, లుయిజియాన, అర్కన్సా, ఓక్లహోమా, టెక్సస్ నివాసులైన బహాయిలను ఉద్దేశించి 1917 సం. ఫిబ్రవరి 3న హైఫాలో, ఇస్మాయిల్ ఆఖా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లోని ఈ పదహారు దక్షిణాది రాష్ట్రములూ సమశీతోష్ణ మండలస్థితములే. ఈ ప్రాంతమున ప్రాకృతికప్రపంచ పరిపూర్ణతలు సర్వసమగ్రముగా వెల్లడియైనవి. ఎందులకనగా, పర్యావరణ సమతుల్యతా, ప్రకృతి సౌందర్యమూ, గ్రామసీమల భౌగోళిక విన్యాసమూ మేధస్సులలోనూ, మనోభావముల యందునా మహత్తర ప్రభావమును ప్రదర్శిస్తాయి. పరిశీలనాత్మకముగ, అనుభవపూర్వకముగ, ప్రస్ఫుటముగ వెల్లడియైన వాస్తవమిది.
పవిత్ర దివ్యావతారమూర్తులు సైతము, అత్యంత సమతులన స్వభావులై యుండెడివారు; వారి శరీరారోగ్యమూ, సర్వసమగ్రతా అత్యంత పరిపూర్ణములై, వారి భౌతికతత్త్వములు దేహదార్ఢ్యతాయుతములై, వారి శక్తులు నిర్దిష్టసరళీ సమన్వితములై, వారి బాహ్యస్పందనలు అంతర్లీన గ్రహణశక్త్యనుసంధానితములై, అసాధారణ శీఘ్రతాయుతములై, సమన్వయ ప్రపూరితములై యుండెడివి.
ఓ నా దేవా! ఓ నా దేవా! నీ వాక్కును జనసామాన్యమున ప్రవృద్ధ మొనరించి, నీ జనులయందున నీ బోధనలను పరివ్యాపనము గావింప సంకల్పించి, మహత్తరకార్యమున మగ్నుడనైన నన్ను, నా అల్పత్వమున, అశక్తత యందున వీక్షింపుచున్నాడవు. పవిత్రాత్మ నిశ్వాసముతో నీవు నాకు సాహాయ్యపడకుండినచో, విజయము నొందుటకు నీ సువిఖ్యాత సామ్రాజ్యసేనలతో నాకు తోడుపడకుండినచో, మక్షికమును పక్షీంద్రునిగ, జలబిందువును నదులుగ, సముద్రములుగ, అణువును దీపికలుగ సూర్యులుగ పరివర్తన గావింపగల నీ యనుగ్రహములను నాపై కురియింప నిచో నే నెటుల సాఫల్యత నొందగలను. ఓ నా ప్రభూ! నా జిహ్వ సర్వజనులయందుననూ నీ ప్రస్తుతులను, విశిష్టతలను వచియించునటుల, నీ ప్రేమ, పరిజ్ఞానముల మధువుతో నా మనస్సు ఉప్పొంగునటుల నీ విజయ ప్రదాయక, కార్యసాధకశక్తితో నాకు తోడ్పడు.
[యునైటెడ్ స్టేట్స్ లోని తొమ్మిది ఉత్తరీశాన్యరాష్ట్రాలు: మెయిన్, మసచుసెట్స్, న్యూ హ్యాంప్షర్, రోడ్ ఐలండ్, కనెడికట్, వెర్మాంట్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్ నివాసు లైన బహాయిలను ఉద్దేశించి 1917 సం. ఫిబ్రవరి 2న హైఫాలో, అబ్దుల్-బహా నివాసంలోని ఇస్మాయిల్ ఆఖా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
నిజైకదైవ దృష్టిలో దేశములన్నియూ ఒక్కటే దేశము, సకల నగరములదీ, గ్రామములదీ ఒకే ప్రాతిపదిక. ఏదియూ ఇంకొకదానిని మించిన విశిష్టత నొంది యుండలేదు. అవన్నియూ దైవక్షేత్రములే, జనావాసములే. అయితే, విశ్వాసముతో, దృఢనిశ్చయముతో, ఒకరిపై ఒకరు సాధించిన ప్రాధాన్యతతో, నివాసి - ఆవాసమునకు గౌరవమును చేకూరుస్తాడు. కొన్ని దేశములు విశిష్టతను సంతరించుకుని, ఉదాత్తస్థాయి నందుకుంటాయి. ఉదాహరణకు: యూరోపియన్, అమెరికన్ దేశముల యందలి కొన్ని - పర్యావరణ రమ్యతలోనూ, జలసమృద్ధిలోనూ, పర్వతముల, మైదానముల, పచ్చికబీళ్ల మనోజ్ఞతలోనూ కొన్ని దేశములను అధిగమించినప్పటికీ, పాలస్తీనా మాత్రము - అబ్రహామ్ నాటి నుండి ప్రవక్తల ముద్ర1 అవతరణము వరకూ, పవిత్రావతారములు ఆ దేశమున వసించడమో, అచటకు తరలిపోవడమో, ఆ దేశము ద్వారా పయనించడమో జరిగినందున - దేశములకే తలమానికమైనది. అటులే, ప్రవక్తృత్వ జ్యోతి భాసిల్లినందున మక్కా, మదీనాలు అనంతకీర్తిని సముపార్జించుకొని యున్నవి. ఈ కారణముననే అన్య దేశములకన్ననూ పాలస్తీనా, హిజాజ్ లకు విశిష్టత చేకూరినది.
ఆ విధముగనే, నిజైకదైవదృష్టిలో అమెరికా ఖండము: ఆయన జ్యోతిర్వైభవ మావిష్కృతము కావలసిన, ఆయన దివ్యధర్మమర్మములు ప్రదర్శితములు కావలసిన, ధర్మవర్తనులు వసింపవలసిన, స్వేచ్ఛాజీవులు సమీకృతులు కావలసిన భూభాగము. అందువలన, అక్కడి ప్రతి ప్రాంతమూ ఆశీఃకృతమైనది; అయితే, విశ్వాస, అభయప్రదానముల పరముగా ఈ తొమ్మిది రాష్ట్రములూ అనుగ్రహీతము లైనందున, తత్ప్రాముఖ్యతతో అవి - ఆధ్యాత్మిక మహద్భాగ్యమునకు పాత్రత నొందినవి. ఈ అనుగ్రహప్రాధాన్యత నవి గ్రహియించి తీరవలె: ఎందులకనగా, అవి అంతటి బహూకృతికి పాత్రమైనవి, ఈ ఘనతరానుగ్రహమునకు ధన్యవాదముల నర్పించుటకై - అవి దివ్యసౌరభముల పరివ్యాపనమున కుద్యమింపవలె. తద్వారా: “స్వర్గమునకూ, భూమికీ జ్యోతి భగవంతుడే: ఆయన జ్యోతి అనురూపత గోడ గూటిలోని దివ్వె; గాజుపేటికలో దాచి ఉంచబడిన దాదీపము; ప్రకాశమయ నక్షత్రము వలె కానవచ్చు నాగాజు. అది ఒక ధన్యవృక్షపు – ప్రాక్పశ్చిమములలో దేనికీ చెందని ఆలివ్ వృక్షపు – తైలముతో ప్రజ్జ్వలితమైనది; అది ఆశించునది అల్పమే, కాని, ఏ అగ్నీ తనను స్పర్శించకున్ననూ ఆ తైలము వెలుగు నిచ్చును. ఈ వెలుగు ఇంకొక తేజముతో మిళితమైనది. భగవంతుడు తన తేజమును తనకు ఇష్టులైనవారి వంకకే ప్రసరించు,”2 నను ఖురాన్ పవిత్రవాక్కులు సాకారము కావచ్చును.
ఈ అనుగ్రహములన్నియూ ఇప్పుడు ఈ తొమ్మిది రాష్ట్రములలోనూ నెలకొని, పరిపూర్ణముగా దృగ్గోచర మౌతాయి. దివ్యవనపాలుడు ఆ పుణ్యభూమిని జేరి, ఆ మహోదాత్త బోధనాబీజముల నాక్షేత్రమున వైచినాడు; భగవంతుని అనుగ్రహ జలధార వర్షితమైనది, సత్యసూర్యోష్ణిమ - అనగా దయాన్వితుని ఆశీస్సులు - పూర్ణతేజముతో ప్రసరింపనైనది. ఆ ధన్యజీవులయందలి ప్రతి ఒక్కరూ అప్రమేయుడైన ఏకైక జలప్రదాత కాగా, ప్రాక్పశ్చిమ అమెరికాలు మనోహర స్వర్గముగా పరివర్తన మొందవచ్చును. తద్వారా, సర్వోత్కృష్ట దేవగణమునుండి “ధన్యులు మీరు, మరియొకమారు, ధన్యులు మీరు,”3 అను ఉద్ఘోషణమును మీ రాలకింపవచ్చును.
ఓ సర్వశక్తిశాలీ! మేము నీ సేవకులము నీ దీనులము; ఒంటరులము - నీ సాన్నిధ్యాకాంక్షులము, నీ స్రవంతీజల దాహార్తులము, అస్వస్థులము – నీ వొన గూర్చు స్వస్థత నభిలషిస్తున్నాము. నీ పథమున పయనిస్తు న్నాము, నీ సౌరభపరివ్యాపనము దక్క మా కింకొక లక్ష్యమో, ఆశయమో లేదు; కనుక ఆత్మ లన్నియూ: “ఓ దేవా, మమ్ము సన్మార్గమునకు నిర్దేశింపు,”2 మని ఆక్రందింపవచ్చును. వెలుగును జూచుటకై వారి నేత్రములు తెరువబడు గాక; వా రజ్ఞానాంధకార విముక్తు లగుదురు గాక. వారు నీ మార్గదర్శకజ్యోతిని పరివేష్టింతురు గాక. భాగము నొందని ప్రతి యొక్కరునూ భాగము నొందెదరు గాక. అభాగ్యులు నీ మహిమల సాన్నిహిత్యము నొందెదరు గాక.
ఓ సర్వశక్తిమంతుడా! వాత్సల్యదృష్టితో మమ్ము వీక్షించు, దైవానుగ్రహములను మాకు ప్రసాదించు, పవిత్రాత్మ నిశ్వాసమును మా కనుగ్రహించు, తద్వారా, మేము నీ సేవయందున సాహాయ్యమునొంది, నీ మార్గదర్శనజ్యోతితో ఈ ప్రాంతముల యందున సముజ్జ్వలతారల వలె ప్రకాశింపవచ్చును.
[యునైటెడ్ స్టేట్స్ కు చెందిన పదకొండు పశ్చిమ రాష్ట్రాలు: న్యూ మెక్సికో, కొలరాడో, అరిజోనా, నెవాడ, కాలిఫోర్నియా, వయోమింగ్, యూటా, మంటానా, ఐడహో, ఓరెగన్, వాషింగ్టన్ ల నివాసుల నుద్దేశించి 1916సం. ఏప్రిల్ 1న బహజీ సౌధంలోని అబ్దుల్-బహా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ దివ్యసామ్రాజ్య నందినీ, నందనులారా:
నా హృదయాంతరాళమునుండి మిత్రుల పక్షాన ప్రార్థిస్తూ, భగవంతుని దివ్యసామ్రాజ్యానుగ్రహము నర్ధిస్తూ, పవిత్రాత్మ నిగూఢాలాపముల ప్రత్యక్షప్రభావమును యాచిస్తూ, వారిని గుర్తు చేసుకొనుట తప్ప రేయింబవళ్లూ నా కింకొక వ్యాపకము లేదు. పరమపూజ్యుడైన వదాన్యతాధీశుని ఆశీస్సులతో, ఆ సమయములో ఆత్మలకు భగవన్మిత్రులు జీవశ్వాస నందిస్తూ మానవకోటి మనోచైతన్యమునకు నిగూఢహేతువు కాగలరను ఆశతో ఉన్నాను; తత్ప్రశంసనీయ పర్యవసానములు మానవాళి వైభవమునకూ, మహదానందమునకూ శాశ్వతప్రయోజనకరములగు గాక. కాలిఫోర్నియా, ఓరెగన్, వాషింగ్టన్, కొలరాడో వంటి పశ్చిమ రాష్ట్రములు కొన్నింటిలో పవిత్రతా సౌరభములు పరివ్యాపితములై, నిత్యజీవనస్రవంతినుండి పలువురు భాగమునొంది, భగవత్కృపకు పాత్రులై, దైవానురాగమదిరతో పొంగులు వారెడు కలశమునుండి సేవన మొనరించి మహోన్నత దివ్యగణమాధురి నాలించినారు. భగవంతుని ప్రేమజ్యోతిని న్యూ మెక్సికో, వయోమింగ్, మంటానా, ఐడహో, యూటా, అరిజోనా, నెవాడ రాష్ట్రాలలో సముచిత, సానుకూల విధానమున ప్రజ్జ్వలన మొనరించుట ఇంకనూ జరుగలేదు, భగవంతుని దివ్యసామ్రాజ్యాహ్వానము నెలుగెత్తి ఘోషించుట జరుగలేదు. వీలైతే, ఈ దిశగా ఇప్పుడు కృషి చేయండి. ఆ రాష్ట్రాలలో వ్యక్తిగతంగా మీరైనా పర్యటించండి, కానియెడల ఇంకెవరినైనా ఎంపికచేసి పంపిన పక్షంలో, వారు వారికి బోధించగలరు. ప్రస్తుతమున కారాష్ట్రములు మృతదేహములవలె నున్నవి: వారు వాటికి జీవశ్వాస నందించి, దివ్యస్ఫూర్తిని ప్రసాదింపవలె. తారలవలె వా రాదిఙ్మండలమున ప్రకాశింప వలె, ఆవిధముగా దివ్యవాస్తవికతా సూర్యకిరణములు ఆ రాష్ట్రములను సైతము జ్యోతిర్మయ మొనరింపవచ్చును.
మహనీయ ఖురాన్లో భగవంతుడు ఇలా వచిస్తున్నాడు: “నమ్మినవారికి, నిక్కముగా భగవంతుడు సహాయకుడే. ఆయన వారిని చీకటినుండి వెలుగులోనికి నడిపించును.”1 దాని అర్ధం: విశ్వాసులను భగవంతుడు ప్రేమిస్తాడనీ; కనుక, ఆయన వారిని చీకటినుండి విముక్తిచేసి, తేజోమయ ప్రపంచంలోనికి కొనితెస్తాడనీ.
పావన సువార్తలో సైతం: “మీరు ప్రపంచమంతటా పర్యటించి ప్రజలను దేవుని రాజ్యానికి పిలవం,”2 డని చెప్పనైనది. మీరు ఉద్యమించి, ఈ మహత్తరసేవ నందించి, పలువురికి మార్గదర్శన కారకులు కావలసిన తరుణమిది. ఆ విధంగా ఈ మానవాతీతసేవతో - సమస్తప్రాంతములనూ సేవాసఖ్యతా కిరణములు శోభింప చేయగా, మానవప్రపంచము శాంతినీ, ఆత్మస్థైర్యమునూ పొందవచ్చును.
నేను అమెరికాలో ఉండగా, ప్రతి సమావేశంలోనూ విశ్వశాంతి సిద్ధాంతముల ప్రచార నిమిత్తం యెలుగెత్తి చాటి, ప్రజలకు పిలుపును ఇవ్వనైనది. ఐరోపా ఖండము ఆయుధాగారము వలె అయినదనీ, భీషణాగ్నికది ఆహుతి యగుట కేవల మొక్క అగ్నికణముపై ఆధారితమై ఉన్నదనీ, రానున్న కాలంలో, అనగా రెండు మూడేళ్లలో యోహాను ప్రకటనగ్రంథంలోనూ, దానియల్ గ్రంథంలోనూ ప్రస్తావితమైన దెల్లయూ నెరవేరుననీ, సాకారమగుననీ నేను స్పష్టముగా చెప్పనైనది. ఈ అంశము అక్టోబర్ 12, 1912 నాటి శాన్ ఫ్రాన్సిస్కో బులెటిన్ లో ప్రచురితమైనట్లున్నది. మీరు దానిని చూసినచో, వాస్తవము స్పష్టమూ, సువిదితమూ అవుతుంది; ఆ విధముగా, సుపరిమళ పరివ్యాపనా సమయ మిదియేనని సంపూర్ణముగా తెలిసికొనవచ్చును.
మానవుని ఔదార్యము భగవత్సంబంధితమై ఉండవలె, వేరొక తీరున చెప్పవలెనంటే, అది దైవానుగ్రహ సాహాయ్యము నందుకొనుచూ ఉండవలె తద్వారా, మనుష్య ప్రపంచమున కాతడు చైతన్యహేతువు కాగలడు.
ఉత్తరీశాన్య రాష్ట్రాల బహాయిలకు వెలువరించిన దివ్యఫలకము
[యునైటెడ్ స్టేట్స్ కు చెందిన తొమ్మిది ఉత్తరీశాన్య రాష్ట్రాలు: మెయిన్, మసచుసెట్స్, న్యూ హ్యాంప్షర్, రోడ్ ఐలండ్, కనెడికట్, వెర్మాంట్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్ నివాసులైన బహాయిల నుద్దేశించి 1916 సం. మార్చి 26 న బహజీ సౌధంలోని అబ్దుల్-బహా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఓ స్వర్గదూతలారా!
నౌరూజ్ పర్వదినములివి. సహృదయులైన ఆ మిత్రులను గురించి సదా నేను ఆలోచిస్తూనే ఉంటాను. అమెరికన్ రిపబ్లిక్కులలో జరుగుతున్న ఆ సమావేశాలు - హృదయాలలో భగవంతుని ప్రేమజ్యోతి తేజరిల్లేలా, మైనపువత్తులవలె ప్రజ్జ్వలించి, దివ్యబోధనాకిరణములు ఆ విధముగా అమెరికన్ రాష్ట్రాలను మహత్తర మార్గదర్శకత్వ తారాసమన్వితమైన సువిస్తృతాంతరిక్షము వలె రత్నాలంకృతను, శోభాసమన్వితను గావింపవలెనని - మీలో ప్రతి ఒక్కరి నిమిత్తమూ ఏకత్వద్వారసీమ నుండి అనుగ్రహ, సహకారముల నర్థిస్తున్నాను.
అట్లాంటిక్ తీరంలోని ఉత్తరీశాన్యరాష్ట్రాలు: మెయిన్, న్యూ హ్యాంప్షర్, మసచుసెట్స్, రోడ్ ఐలండ్, కనెడికట్, వెర్మాంట్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్. ఈ రాష్ట్రములలోని కొన్నింటిలో విశ్వాసులున్నారు, అయితే, ఈ రాష్ట్రముల నగరములలో కొన్ని, ఇంకనూ దివ్యసామ్రాజ్యప్రభలతో శోభిల్లనూ లేదు, దివ్యబోధనల నెఱుగనూ లేదు. అందువల్ల, మీలోని ప్రతి ఒక్కరూ వీలున్నప్పుడల్లా ఆ నగరములకు త్వరత్వరగా తరలి, మహత్తర మార్గదర్శకత్వ తేజోసమన్వితులై తారల వలె ప్రకాశింపవలె. భగవంతుడు ఖురాన్లో ఇలా ప్రవచించినాడు:“భూమి నల్లని బీడుగా వుండేది. మే మప్పుడు దానిపై వర్షమును కురియింపచేయగా, తక్షణమే అది హరితము, సస్యశ్యామలము అయినది, సర్వవిధములైన మొక్కలూ సమృద్ధిగా మొలకెత్తినవి.”1 వేరొక విధముగా చెప్పవలెనంటే, నేల నల్లనిదనీ, వసంత కాలపు వర్షపుజల్లులు తనపై వర్షించినప్పు డది సచేతనమైనదనీ, వివిధవర్ణముల పుష్పములూ వికసించాయనీ అంటున్నా డాయన. ప్రాకృత్రిక ప్రపంచమందలి మానవ హృదయాలు మట్టివలె నల్లనివని దీనికి అర్థం. అయితే, దివ్యత్వవాహినులు భువికి దిగివచ్చి, సముజ్జ్వల ప్రభలు సాక్షాత్కరించినప్పుడు హృదయములు పునరుజ్జీవనము నొందుతాయి, ప్రకృతి అనబడే అంధకారము నుండి విముక్తినొందుతాయి, దివ్యమహిమాన్విత కుసుమములు వృద్ధిచెంది, సమృద్ధతను సంతరించుకుంటాయి. పర్యవసానముగా, మానవుడు మనుష్యప్రపంచమునకు చైతన్య కారకుడై, దైవస్ఫూర్తితో పావనగ్రంథావిష్కృత పవిత్రబోధనలను పరివ్యాప్తము సేయుచూ ఉండవలె. మీరు తూర్పు, పడమరలకు పయనించి, మహత్తర మార్గదర్శకత్వకాంతితో ప్రజలను జ్ఞానవంతులను గావింపుడు, తద్వారా, వారు అమరజీవితమునం దొక పాలు నొందెద,2 రని పవిత్ర సువార్తలో ప్రస్తావితమైనది. ఉత్తరీశాన్యరాష్ట్రములు అపార సామర్థ్యమును సంతరించుకొని నందులకు భగవంతుడు శ్లాఘనీయుడు. ఏలయన, భూమి సారవంతము; దివ్యజలధార వర్షిస్తున్నది. మీ రిప్పుడు దివ్యహాలికులై, సిద్ధము సేయబడిన నేలలో స్వచ్ఛబీజములను చల్లవలె. ప్రతి విత్తనపు దిగుబడీ పరిమితమే, అయినను, దివ్యబోధనా బీజముల అనుగ్రహాశీస్సు లపరిమితములు. రానున్న శతాబ్దిలో, కాలావృత్తమునం దింకెన్నియో పంటదిగుబడుల సమీకరణము జరుగ గలదు. దీనిని పూర్వతరముల కృషి యని పరిగణింపుడు. యేసుక్రీస్తు జీవిత కాలమునం దాయనను విశ్వసింపుచుండిన స్థిరచిత్తులు లెక్కకు కొందరే అయినను, దైవాశీస్సు లెంత సమృద్ధిగా వర్షించినవనిన, కొద్ది సంవత్సరములలోనే, లెక్కకు మిక్కిలిగ జనులు సువార్తచ్ఛాయలోనికి ప్రవేశించినారు. “ఒక్క గింజ ఏడు కంకుల నిచ్చును, ప్రతి కంకియు నూరేసి గింజల నొంది యుండు,”3 నని ఖురాన్లో, భగవంతుడు ప్రవచింపనైనది. వేరొక విధముగ చెప్పవలె ననిన, ఒక్కటే ధాన్యపుగింజ ఏడువందల గింజలగును; భగవంతుడు తలచుకొనినచో, వాటిని రెండింతలైనను చేయగలడు. ధన్యజీవి యొక్కడు దేశమునకే మార్గదర్శన హేతువగుట సకృత్తుగా జరుగుతూ వచ్చినదే. మనమిప్పుడు మన శక్తిసామర్ధ్యములను గణనము సేయరాదు; తద్భిన్నముగా, బిందువునుండి అంబుధినీ, అణువునుండి ఆదిత్యుడినీ సృజియించిన భగవంతుని ఉపకృతుల పైనను, అనుగ్రహముల పైనను మన మీనాడు దృష్టిని కేంద్రీకరింపవలె.
మీకు ప్రశంసాభినందనలు!
References:
1 ఖురాన్ 22:5 2 బైబిల్ - మార్కు 16:15 3ఖురాన్ 2:
ఉత్తరీశాన్య రాష్ట్రాల బహాయిలకు వెలువరించిన దివ్యఫలకము
AB01130
[యునైటెడ్ స్టేట్స్ లోని తొమ్మిది ఉత్తరీశాన్యరాష్ట్రాలు: మెయిన్, మసచుసెట్స్, న్యూ హ్యాంప్షర్, రోడ్ ఐలండ్, కనెడికట్, వెర్మాంట్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్ నివాసు లైన బహాయిలను ఉద్దేశించి 1917 సం. ఫిబ్రవరి 2న హైఫాలో, అబ్దుల్-బహా నివాసంలోని ఇస్మాయిల్ ఆఖా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ నిజ మిత్రులారా:
నిజైకదైవ దృష్టిలో దేశములన్నియూ ఒక్కటే దేశము, సకల నగరములదీ, గ్రామములదీ ఒకే ప్రాతిపదిక. ఏదియూ ఇంకొకదానిని మించిన విశిష్టత నొంది యుండలేదు. అవన్నియూ దైవక్షేత్రములే, జనావాసములే. అయితే, విశ్వాసముతో, దృఢనిశ్చయముతో, ఒకరిపై ఒకరు సాధించిన ప్రాధాన్యతతో, నివాసి - ఆవాసమునకు గౌరవమును చేకూరుస్తాడు. కొన్ని దేశములు విశిష్టతను సంతరించుకుని, ఉదాత్తస్థాయి నందుకుంటాయి. ఉదాహరణకు: యూరోపియన్, అమెరికన్ దేశముల యందలి కొన్ని - పర్యావరణ రమ్యతలోనూ, జలసమృద్ధిలోనూ, పర్వతముల, మైదానముల, పచ్చికబీళ్ల మనోజ్ఞతలోనూ కొన్ని దేశములను అధిగమించినప్పటికీ, పాలస్తీనా మాత్రము - అబ్రహామ్ నాటి నుండి ప్రవక్తల ముద్ర1 అవతరణము వరకూ, పవిత్రావతారములు ఆ దేశమున వసించడమో, అచటకు తరలిపోవడమో, ఆ దేశము ద్వారా పయనించడమో జరిగినందున - దేశములకే తలమానికమైనది. అటులే, ప్రవక్తృత్వ జ్యోతి భాసిల్లినందున మక్కా, మదీనాలు అనంతకీర్తిని సముపార్జించుకొని యున్నవి. ఈ కారణముననే అన్య దేశములకన్ననూ పాలస్తీనా, హిజాజ్ లకు విశిష్టత చేకూరినది.
ఆ విధముగనే, నిజైక దైవదృష్టిలో అమెరికా ఖండము: ఆయన జ్యోతిర్వైభవ మావిష్కృతము కావలసిన, ఆయన దివ్యధర్మమర్మములు ప్రదర్శితములు కావలసిన, ధర్మవర్తనులు వసింపవలసిన, స్వేచ్ఛాజీవులు సమీకృతులు కావలసిన భూభాగము. అందువలన, అక్కడి ప్రతి ప్రాంతమూ ఆశీఃకృతమైనది; అయితే, విశ్వాస, అభయప్రదానముల పరముగా ఈ తొమ్మిది రాష్ట్రములూ అనుగ్రహీతము లైనందున, తత్ప్రాముఖ్యతతో అవి - ఆధ్యాత్మిక మహద్భాగ్యమునకు పాత్రత నొందినవి. ఈ అనుగ్రహప్రాధాన్యత నవి గ్రహియించి తీరవలె: ఎందులకనగా, అవి అంతటి బహూకృతికి పాత్రమైనవి, ఈ ఘనతరానుగ్రహమునకు ధన్యవాదముల నర్పించుటకై - అవి దివ్యసౌరభముల పరివ్యాపనమున కుద్యమింపవలె. తద్వారా: “స్వర్గమునకూ, భూమికీ జ్యోతి భగవంతుడే: ఆయన జ్యోతి అనురూపత గోడ గూటిలోని దివ్వె; గాజుపేటికలో దాచి ఉంచబడిన దాదీపము; ప్రకాశమయ నక్షత్రము వలె కానవచ్చు నాగాజు. అది ఒక ధన్యవృక్షపు – ప్రాక్పశ్చిమములలో దేనికీ చెందని ఆలివ్ వృక్షపు – తైలముతో ప్రజ్జ్వలితమైనది; అది ఆశించునది అల్పమే, కాని, ఏ అగ్నీ తనను స్పర్శించకున్ననూ ఆ తైలము వెలుగు నిచ్చును. ఈ వెలుగు ఇంకొక తేజముతో మిళితమైనది. భగవంతుడు తన తేజమును తనకు ఇష్టులైనవారి వంకకే ప్రసరించు,”2 నను ఖురాన్ పవిత్రవాక్కులు సాకారము కావచ్చును.
ఇట్లనుచున్నా డాయన: ప్రాకృతిక ప్రపంచ మంధకారమయ ప్రపంచము, ఏల యనగా, సహస్రభ్రష్టత్వములకు మూలమది; అంతియకాదు, చీకటికి తోడైన చీకటి యది. ప్రాకృతిక ప్రపంచశోభ సత్యసూర్యుని తేజముపై ఆధారితము. మార్గదర్శన కారుణ్యము, జ్ఞానవిజ్ఞతలనబడు గాజుగోళమున ప్రజ్జ్వలితమైన మైనపువత్తి వంటిది; మానవహృదయ దర్పణమే ఆ జ్ఞానవిజ్ఞతల గాజుగోళము. ఆ దేదీప్యమాన దీపిక తైలము ధన్యవృక్ష ఫలము నుండి స్వీకృతమైనది; ఆ తైలము అగ్నిలేకనే వెలుగు నటుల శుద్ధీకృతమైనది. దీపిక కాంతితీవ్రతనూ, గాజుగోళపు పారదర్శకతనూ, దర్పణ నైర్మల్యమునూ సమీకృత మొనరించినప్పుడు, దీప్తికి దీప్తి చేకూరిన యట్లగును.
సూక్ష్మముగా చెప్పవలెననిన, ఈ తొమ్మిది ఆశీఃకృత రాష్ట్రములయందునా అబ్దుల్-బహా - పర్యటించినాడు, ఒకచోటినుండి వేరొకచోటికి వెడలినాడు, దివ్యగ్రంథ జ్ఞానవ్యాఖ్యానము గావించినాడు, పరిమళ పరివ్యాపన మొనరించినాడు. రాష్ట్రములలో దివ్యసదనమును చాలవరకు నెలకొలిపి, బోధనాద్వారము దెరచినాడు. స్వచ్ఛబీజము లను ఆ రాష్ట్రములలో చల్లి, అనుగ్రహవృక్షములను నాటినాడు.
ఇక ఇప్పుడు, భగవద్విశ్వాసులును, దయామయుని సేవికలును ఈ క్షేత్రములకు నీటిని పెట్టి, ఈ దివ్యసస్యముల సేద్యమున అధికశక్తితో నిమగ్నులు కావలె. తద్వారా, బీజములు మొలిచి, ప్రవృద్ధములై, సౌభాగ్యానుగ్రహము సాకారమై, పంట దిగుబడు లెన్నియో పుష్కలముగ సమకూడవచ్చును.
స్వచ్ఛమైన సారవంతభూమికి, స్వామి అయిన కర్షకుని వంటిది - భగవంతుని దివ్యసామ్రాజ్యము. అందున దివ్యబీజములు వేయబడతాయి, దైవేచ్ఛామేఘములు వర్షిస్తాయి, సత్యసూర్య కిరణములు ప్రసరిస్తాయి.
ఈ అనుగ్రహములన్నియూ ఇప్పుడు ఈ తొమ్మిది రాష్ట్రములలోనూ నెలకొని, పరిపూర్ణముగా దృగ్గోచర మౌతాయి. దివ్యవనపాలుడు ఆ పుణ్యభూమిని జేరి, ఆ మహోదాత్త బోధనాబీజముల నాక్షేత్రమున వైచినాడు; భగవంతుని అనుగ్రహ జలధార వర్షితమైనది, సత్యసూర్యోష్ణిమ - అనగా దయాన్వితుని ఆశీస్సులు - పూర్ణతేజముతో ప్రసరింపనైనది. ఆ ధన్యజీవులయందలి ప్రతి ఒక్కరూ అప్రమేయుడైన ఏకైక జలప్రదాత కాగా, ప్రాక్పశ్చిమ అమెరికాలు మనోహర స్వర్గముగా పరివర్తన మొందవచ్చును. తద్వారా, సర్వోత్కృష్ట దేవగణమునుండి “ధన్యులు మీరు, మరియొకమారు, ధన్యులు మీరు,”3 అను ఉద్ఘోషణమును మీ రాలకింపవచ్చును.
మీకు ప్రశంసాభినందనలు.
ఈ ప్రార్థన బోధకులకూ, మిత్రులకూ నిత్యపఠనీయము:
దయాన్వితుడవైన ఓ దేవదేవా! నీకు ప్రస్తుతి - మాకు మార్గదర్శన మహాపథ దర్శనము గావించి, సామ్రాజ్యద్వారములను దెరచి, సత్యసూర్యునిచే సాక్షాత్కృతుడ వైనావు. అంధులకు దృష్టినిచ్చినావు; బధిరులకు వినికిడి ననుగ్రహించినావు; నిర్జీవులను సజీవులను గావించినావు; దీనులను శ్రీమంతులను జేసినావు; పెడద్రోవ బట్టిన వారికి పథదర్శన మొనరించినావు; నోరెండిన వారిని మార్గదర్శక ప్రస్రవణము దెసకు నడిపినావు; దాహార్తి నొందిన మత్స్యమును సత్యసముద్రపు దరిజేర్చినావు; త్రిమ్మరుచున్న పక్షులను కృపయను గులాబి వనములోని కాహ్వానించినావు.
ఓ సర్వశక్తిశాలీ! మేము నీ సేవకులము నీ దీనులము; ఒంటరులము - నీ సాన్నిధ్యాకాంక్షులము, నీ స్రవంతీజల దాహార్తులము, అస్వస్థులము – నీ వొన గూర్చు స్వస్థత నభిలషిస్తున్నాము. నీ పథమున పయనిస్తు న్నాము, నీ సౌరభపరివ్యాపనము దక్క మా కింకొక లక్ష్యమో, ఆశయమో లేదు; కనుక ఆత్మ లన్నియూ: “ఓ దేవా, మమ్ము సన్మార్గమునకు నిర్దేశింపు,”2 మని ఆక్రందింపవచ్చును. వెలుగును జూచుటకై వారి నేత్రములు తెరువబడు గాక; వా రజ్ఞానాంధకార విముక్తు లగుదురు గాక. వారు నీ మార్గదర్శకజ్యోతిని పరివేష్టింతురు గాక. భాగము నొందని ప్రతి యొక్కరునూ భాగము నొందెదరు గాక. అభాగ్యులు నీ మహిమల సాన్నిహిత్యము నొందెదరు గాక.
ఓ సర్వశక్తిమంతుడా! వాత్సల్యదృష్టితో మమ్ము వీక్షించు, దైవానుగ్రహములను మాకు ప్రసాదించు, పవిత్రాత్మ నిశ్వాసమును మా కనుగ్రహించు, తద్వారా, మేము నీ సేవయందున సాహాయ్యమునొంది, నీ మార్గదర్శనజ్యోతితో ఈ ప్రాంతముల యందున సముజ్జ్వలతారల వలె ప్రకాశింపవచ్చును.
నిశ్చయముగా, నీవు శక్తిసమన్వితుడవు, శౌర్యశాలివి, విజ్ఞుడవు, సంవీక్షకుడవు.
దక్షిణాది రాష్ట్రాల బహాయిలకు వెలువరించిన దివ్యఫలకము
[యునైటెడ్ స్టేట్స్ కు చెందిన పదహారు దక్షిణాది రాష్ట్రాలు: డెలవేర్, మేర్లండ్, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, నార్త్ కరొలైనా, సౌత్ కరోలైనా, జార్జియా, ఫ్లారిడా, అలబేమ, మిసిసిపి, టెనెసీ, కెంటకీ, లుయిజియానా, అర్కన్సా, ఓక్లహోమా, టెక్సస్ నివాసులైన బహాయిల నుద్దేశించి 1916 సం. మార్చి 27న బహాఉల్లా దివ్యసమాధికి చేరువనున్న ఉద్యానవనంలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఓ భగవత్సామ్రాజ్య దూతలారా!
కొన్ని దినములకు పూర్వ మాభగవద్విశ్వాసుల కొక ఉపదేశమును వ్రాయనైనది, అయితే, ఇవి నౌరూజ్ పర్వదినము లైనందున, మీరు నాకు జ్ఞప్తికి వచ్చినారు; ఈ వైభవప్రపూరిత విందు సందర్భమున మీకు ఈ అభినందనలను పంపుతున్నాను. దినములన్నయూ ధన్యత నొందినవే, కానీ, పర్షియాకు ఈ విందు - జాతీయ పర్వ దినము. దీనిని పర్షియనులు గత వేలాది వత్సరములుగా జరుపుకుంటూ వస్తున్నారు. వాస్తవమునకు - భగవత్స్మరణమున, భగవత్పరిమళ పరివ్యాపనమున, భగవత్సామ్రాజ్యమునకు ప్రజల నాహ్వానించుట యందున తాను గడుపునట్టి ప్రతి రోజూ మానవునకు పర్వదినమే. మీరు భగవత్సామ్రాజ్య సేవలో నిమగ్నులై, భగవన్మత సముద్ఘోషణ మందున నిరతులై ఉన్నందులకు భగవంతునకు ప్రస్తుతి. కనుక, మీ వన్నియూ పర్వదినములే. భగవంతుని సహకారానుగ్రహములు మీపై వర్షించు ననుటకు సంశయము లేదు.
యునైటెడ్ స్టేట్స్ లోని దక్షిణాది రాష్ట్రాలైన – డెలవేర్, మేర్లండ్, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, నార్త్ కరొలైనా, సౌత్ కరోలైనా, జార్జియా, ఫ్లారిడా, అలబేమ, మిసిసిపి, టెనెసీ, కెంటకీ, లుయిజియానా, అర్కన్సా, ఓక్లహోమా, టెక్సస్ లకు చెందిన మిత్రులు కొందరే. కనుక, ఆయా రాష్ట్రములకు స్వయముగా మీరే వెళ్లడమో, పలువురు ధన్యజీవులను పంపించడడమో చేసిన పక్షంలో, వారు - ప్రజలను దివ్యసామ్రాజ్యము నాశ్రయించేలా పథనినిర్దేము గావింపగలరు. పవిత్ర దివ్యావతారమూర్తులయం దొకరు ఒక విశ్వాసిని ఉద్దేశించి, ఒక వ్యక్తి ఒక ఆత్మచైతన్యమునకు కారణభూతు డైనచో — అది అనంతైశ్వర్యమున కన్ననూ మిన్నయని చెప్పనైనది. “ఓ ఆలీ! భగవంతుడు నీ ద్వారా ఒక్కనికి మార్గదర్శన మొనరించెనేని, సమస్త సంపదల కన్ననూ సర్వోత్తమ మది.” ఇంకా, ఇలా అంటున్నా డాయన: “మమ్ము ఋజుపథమునకు నిర్దేశింపుము.”1 అనగా, మాకు సరియైన దారిని చూపమని. “మీరు ప్రపంచము నందలి ప్రాంతము లన్నింటికీ పయనించి, దేవుని రాజ్యావతరణ శుభసమాచారమును వెల్లడింపు,”2 డని సువార్తలో సైతము ప్రస్తావితమైనది.
సంక్షిప్తముగా, మీరీ విషయమున బృహద్యత్న మొనరించి, వదాన్యతను ప్రదర్శింతురని భావింతును. మీరు తోడ్పాటునొంది, అనుగ్రహీతులు కాగలరనునది సునిశ్చయము. దివ్యసామ్రాజ్యపు టధివాస్తవికల, ప్రాధాన్యతల ప్రత్యక్షతా శుభవర్తమానమును ప్రకటించు నాతడు, సారవంతమైన భూమిలో స్వచ్ఛబీజములను చల్లు కర్షకుని వంటి వాడే. వాటిపై వసంతమేఘ మనుగ్రహవర్షమును కురియించును; ఇక, కర్షకుని స్థాయి గ్రామాధిపతి దృష్టిలో సమున్నతమై, పంట దిగుబడు లెన్నియో సమకూడుతవి.
కనుక, ఓ భగవన్మిత్రులారా! దివ్యాశీస్సులనూ, దేవదేవుని అనుగ్రహమునూ అందుకొనుటకై, మీరు ఈ సమయపు విలువను దెలిసికొని, బీజములను చల్లుటలో నిమగ్నులు కండు.
[కెనడా – అంటే న్యూ ఫౌండ్లాండ్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలండ్, నోవా స్కోటియా, న్యూ బ్రన్స్విక్, క్విబెక్, సాస్కట్కెవన్, మనిటోబా, అంటారియో, అల్బర్తా, బ్రిటిష్ కొలంబియా, యుకాన్, మెకంజీ, కీవాటిన్, ఉంగావా, ఫ్రాంక్లిన్ ఐలండ్స్– ఇంకా గ్రీన్ల్యాండ్ నివాసులైన బహాయిలకు 1916 సం. ఏప్రిల్ 5న బహాఉల్లా దివ్యసమాధికి చేరువగా ఉన్న ఉద్యాన వనంలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ దివ్యసామ్రాజ్య నందినీ నందనులారా:
భగవంతునకు ప్రస్తుతి, ఆయన సౌరభములు యునైటెడ్ స్టేట్స్ కు చెందిన పలునగరములలో పరివ్యాప్తములై, అనేకులు దివ్యసామ్రాజ్యము దెస కభిముఖులై, అటుగా పురోగమిస్తున్నప్పటికీ, కొన్ని నగరములలో సమైక్యతా పతాక మింకనూ ఆశించినంత ఎగువకు ఎగురవేయబడుటయేని, బైబిల్, సువార్త, ఖురాన్ వంటి పవిత్రగ్రంథముల మర్మములు వెల్లడింపబడుటయేని జరుగనే లేదు. యావన్మిత్రుల అవిరళ కృషితో సమైక్యతాపతాక మారాష్ట్రములయం దావిష్కృతమై, దివ్యబోధనల ప్రచారము జరుగవలసిన అవసరమున్నది, తద్వారా, ఆ రాష్ట్రములు సైతము, దివ్యాశీస్సులలో తమ పాలునూ, మహోదాత్త మార్గదర్శన భాగమునూ స్వీకరింపవచ్చును. అదే విధముగా - న్యూ ఫౌండ్లాండ్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలండ్, నోవా స్కోటియా, న్యూ బ్రన్స్విక్, క్విబెక్, అంటారియో, మనిటోబా, సాస్కట్కెవన్, అల్బర్తా, బ్రిటిష్ కొలంబియా, ఉంగావా, కీవాటిన్, మెకంజీ, యుకాన్, ఇంకా ఆర్కిటిక్ సర్కిల్ లోని ఫ్రాంక్లిన్ ఐలండ్స్ వంటి కెనడా పాలిత ప్రాంతములకు చెందిన భగవద్విశ్వాసులు - ఆత్మత్యాగనిరతులై మార్గదర్శకత్వ మనబడు మైనపు వత్తులవలె కెనడా పాలిత ప్రాంతముల యందున ప్రజ్జ్వలింపవలె. వా రటువంటి ఔదార్యమును ప్రదర్శించిన పక్షంలో, నిస్సంశయముగా - సార్వత్రిక దైవానుగ్రహములకు పాత్రులౌతారు, అమరలోక సహచరు లవిచ్ఛిన్నముగా వారిని బలోపేతుల నొనరింపగలరు, మహత్తర విజయసాధన జరుగుతుంది. దైవేచ్ఛ అయితే, దివ్యసామ్రాజ్యాహ్వానము కెనడా ఉత్తర భాగంలోని ఫ్రాంక్లిన్ ద్వీపనివాసులూ, గ్రీన్ల్యాండ్ వాసులూ అయిన ఎస్కిమోల వీనులను సైతము చేర వచ్చును. గ్రీన్ల్యాండ్లో కనుక భగవంతుని ప్రేమాగ్ని ప్రజ్జ్వలితమైతే, ఆ దేశపు మంచు యావత్తూ కరిగిపోయి, దాని శీతల వాతావరణం ఉష్ణిమను సంతరించుకుంటుంది– అంటే, భగవత్ప్రేమ అనబడే వెచ్చదనంతో హృదయములను స్పర్శించిన పక్షంలో ఆ భూభాగము పవిత్రగులాబీవనముగా, దివ్యస్వర్గముగా రూపొందుతుంది; ఆత్మలు ఫలభరితవృక్షములై, అత్యంతాహ్లాదసౌందర్యములను సంతరించుకుంటాయి. అయితే – కృషి, అపార కృషి – అవసరం. మీరు కనుక కృషి సల్పినట్లైతే, తద్వారా ఎస్కిమోలకు భగవత్పరిమళముల పరివ్యాపనము జరుగవచ్చును. తత్ప్రభావము మహత్తరమూ, సువిస్తృతమూ అవుతుంది. మహనీయ ఖురాన్లో భగవంతుడు ఇలా వచిస్తున్నాడు: సమైక్యతాజ్యోతులు సమస్తప్రపంచాన్నీ శోభిల్లజేసే రోజు వస్తుంది. “పృథివి తన ప్రభుని జ్యోతితో భాసిల్లును”1 మరోలా చెప్పవలెనంటే, దైవజ్యోతితో భూమి ప్రకాశితమౌతుంది. ఆ జ్యోతి సమైక్యతాజ్యోతి. “భగవంతుడు దక్క వేరొక దేవుడు లేడు.” ఆ ఖండమూ, ఎస్కిమోల దీవులూ ఈ ప్రపంచములోని భాగములే. అవి సైతము, ఆ తీరుననే - మహత్తర మార్గదర్శకత్వ మున భాగము నొందవలె.